ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీసేటప్పుడు, మీడియావారితో మాట్లాడే సందర్భాల్లో జయా బచ్చన్ సంయమనం కోల్పోవడం అప్పుడప్పుడు మనం చూశాం కానీ, అమితాబ్ను మనం ఎప్పుడూ అలా చూడలేదు. బిగ్ బి ఎప్పుడూ ప్రశాంత వదనంతో కనిపిస్తారు. అయితే ఒకసారి ఆయన ఇరిటేట్ అయిపోయి భార్య జయపై కేకలు వేశారనీ, అదీ డైనింగ్ టేబుల్ దగ్గర అనీ ఒక ప్రముఖ జర్నలిస్ట్ వెల్లడించారు. ఎందుకంటే.. ఈ ఘటన జరిగింది ఆయన కళ్లముందే కాబట్టి! ఆ జర్నలిస్ట్ ఎవరో కాదు, కరణ్ థాపర్. తాను ఆ ఇద్దరినీ వారి ఇంట్లో ఇంటర్వ్యూ చేసిన అనంతరం ఈ ఉదంతం చోటు చేసుకుందని తను రాసిన 'డెవిల్స్ అడ్వకేట్: ది అన్టోల్డ్ స్టోరీ' బుక్లో ఆయన వెల్లడించాడు.
అమితాబ్ 50వ పుట్టినరోజును పురస్కరించుకొని 1992లో మిస్టర్ అండ్ మిసెస్ బచ్చన్ను వారి ఇల్లు 'ప్రతీక్ష'లో ఇంటర్వ్యూ చేశారు కరణ్. ఆ ఇంటర్వ్యూలో అన్ని ప్రశ్నలకు ఆ ఇద్దరూ కూల్గా సమాధానాలు చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో అమితాబ్ను కరణ్, "తారలతో మీ లవ్ ఎఫైర్స్ గురించి చాలా కథలు వినిపిస్తున్నాయి. పెళ్లి తర్వాత, మరో స్త్రీతో ఎవరితోనైనా మీకు సంబంధం ఉందా? "అని సూటిగా అడిగారు. ఎలాంటి కలవరం లేకుండా, "నో. నెవర్" అని జవాబిచ్చాడు అమితాబ్. "మీకు పర్వీన్ బాబీతో సంబంధం ఉందని అంటున్నారు. అందులో నిజం ఉందా?" అని మళ్లీ అడిగారు కరణ్. "లేదు. నేనూ అలాంటి కథలు చదివాను. అవి నిజం కాదు. కానీ మేగజైన్లు అలాంటి విషయాలను రాయకుండా నేనాపలేను" అన్నారు అమితాబ్. కరణ్ అంతటితో ఆగకుండా, "మరి రేఖ సంగతి ఏమిటి?" అనడిగారు. దానికి బిగ్ బి, "లేదు, ఆమెతో కూడా లేదు" అని ఆన్సర్ ఇచ్చారు. అంతకు మించి ఆయన మాట్లాడలేదు.
అప్పుడు కరణ్ థాపర్ తన భర్త పక్కన సోఫాలో కూర్చున్న జయా బచ్చన్ వైపు తిరిగి, "అమితాబ్ మాటలను నమ్ముతున్నారా?" అనడిగారు. "నేనెప్పుడూ నా భర్తను నమ్ముతాను" అని చెప్పారామె. "మీరు నిజంగానే అంటున్నారా, లేక ఆయన మీ పక్కన కూర్చున్నందున అలా చెబుతున్నారా?" అని రెట్టించారు కరణ్. జయ చిరునవ్వుతో, "నేను నిజంగానే అంటున్నాను, ఎందుకు అనకూడదు?" అని ఆమె తిరిగి ప్రశ్నించారు. ఆ తర్వాత కరణ్ ఆ టాపిక్ వదిలేసి, వేరే టాపిక్ల గురించి అడిగారు. ఇంటర్వ్యూ అయిపోయాక కరణ్ బృందాన్ని భోజనం చేసి వెళ్లాల్సిందేనని ఆ దంపతులు పట్టుపట్టారు.
ఆ సందర్భంలోనే అమితాబ్కు కూడా బాగా కోపం వస్తుందనీ, అప్పుడు ఆయన కేకలు వేస్తారనీ కరణ్కు తెలిసింది. ఇదంతా అమితాబ్ను కొంచెం అన్నం తినమని జయ అడిగినప్పుడు మొదలైంది. "నేనెప్పుడూ రైస్ తిననని నీకు తెలుసు. నేను తినని దాన్ని ఎందుకు తినమని చెప్తున్నావ్?" అని ఆయన అడిగారు. "ఎందుకంటే ఇంకా రోటీలు రాలేదు. అందుకే కొంచెం రైస్ వేస్తానన్నాను" అని చెప్పారు జయ. "ఇంకా రోటీలు ఎందుకు రాలేదో చూస్తాను" అని అంటూనే, అనాలోచితంగా ఆమె, "ఈ మధ్యలో మీరెందుకు కొద్దిగా రైస్ వేయించుకోకూడదు?" అన్నారు. అంతే! "స్టాపిట్. జస్ట్ స్టాపిట్" అని కోప్పడ్డారు అమితాబ్. "నాకు రైస్ వద్దని చెప్పాను. రోటీల కోసం సంతోషంగా వెయిట్ చేస్తాను. నీకు అర్థం కావట్లేదా? నీకేమైంది? నేనేం చెప్తున్నానో ఎందుకు వినవు?" అన్నారు సీరియస్గా. దాంతో బిత్తరపోయిన జయ అక్కడ్నుంచి వెళ్లిపోయారు. తిరిగి ఆ రూమ్లోకి ఆమె రాలేదు. కొద్దిసేపట్లో రోటీలు రావడంతో, అమితాబ్ వాటిని తిన్నారు. ఈ ఉదంతాన్ని తన పుస్తకంలో వివరంగా రాశారు కరణ్ థాపర్.